LAW Common Entrance Test - 2014
(LAWCET-2014)

అంతర్జాతీయస్థాయికి ఎదిగింది 'లా' !

సమాజంలో హోదా, గౌరవాలతో పాటు సామర్థ్యానికి తగిన సంపాదనను అందించే వృత్తుల్లో న్యాయవాద వృత్తి ఒకటి. ప్రజాస్వామ్య మూలస్తంభమైన న్యాయవ్యవస్థలో పనిచేస్తుండటంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజాజీవితంలో ప్రత్యేకస్థానాలను పొందుతున్నారు. ప్రపంచీకరణ, సరళీకరణల నేపథ్యంలో సంక్లిష్ట ఆధునిక వ్యవస్థల అవసరాల మేరకు న్యాయవాద వృత్తి అంతర్జాతీయ రూపాన్ని సంతరించుకుంటోంది.
ప్రస్తుతం భారతదేశంలో 5లక్షల మంది న్యాయవాదులు ఉన్నారు. ప్రతీ సంవత్సరం 15వేల మంది లాయర్లు కొత్తగా ఈ వృత్తిలోకి అడుగుపెడుతున్నారు. దీంతో దేశంలోని లాయర్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. న్యాయవాదులు కోర్టుల ద్వారా రాజ్యాంగపరమైన, చట్టపరమైన హక్కుల సాధన కోసం పోరాడటంలో సమాజం తరఫున ప్రధాన భూమికను పోషిస్తున్నారు. తమ విలువైన సేవలను ప్రజలకు అందిస్తున్నారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన వారికి ఇతర న్యాయ సంబంధిత అర్హతలు కలిగిన వారికి ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగం చేయాలా లేక ప్రైవేటు లాయరుగా ప్రాక్టీస్ చేయాలా నది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
లీగల్ ప్రాక్టీషనర్లు/ అడ్వకేట్లు/ న్యాయ సలహాదారులు 
* న్యాయవాదులు కార్పొరేట్ సంస్థలకు, కంపెనీలకు, వ్యక్తులకు, కుటుంబాలకు, న్యాయ సలహాదారులుగా పనిచేయవచ్చు. అంతే కాకుండా వాళ్లు ట్రస్ట్‌లకు ట్రస్టీలుగా, లా రిపోర్టర్లుగా, కంపెనీ సెక్రటరీలుగా విధులు నిర్వహించవచ్చు. 'లా' కు అనుబంధంగా చేసే ఇతర కోర్సుల వల్ల ఉద్యోగావకాశాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మన దేశంలో అడ్వకేట్ కావాలని కోరిక ఉన్నవారు, న్యాయవాద వృత్తిలో కొనసాగాలని అనుకునేవారు తప్పనిసరిగా న్యాయశాస్త్రంలో డిగ్రీ పొంది ఉండాలి. 1961 నాటి న్యాయవాదులచట్టం నిబంధనల ప్రకారం న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేయాలంటే కేంద్ర లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా 'బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' ఇటీవల ప్రవేశపెట్టిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఈ పరీక్షలో ఫెయిలైనవారు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా తమ పేరును నమోదు చేయించుకోలేరు. ఏ న్యాయస్థానం పరిధిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేయాలనుకుంటున్నారో, ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ సేవలు 
* తగిన అర్హతలున్న వారిని భారతీయ న్యాయసేవలకు సంబంధించి వివిధ పోస్టుల్లో నియమిస్తారు. ప్రభుత్వంలోని న్యాయసంబంధ విభాగానికి న్యాయ సలహాదారుగానూ నియమిస్తారు. ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి భారత ప్రభుత్వ సెక్రటరీలుగానూ ఎదిగే అవకాశం ఉంటుంది. శాసన సంబంధిత అధికార భాషావిభాగంలో హిందీ, ఇతర గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషల కోసం లెజిస్లేటివ్ కాన్సల్స్‌గా కూడా వీరు నియమితులు కావచ్చు.
* రాష్ట్రస్థాయిలోనూ న్యాయశాస్త్రంలో నిపుణులైన వారితో పోస్టులను భర్తీ చేస్తారు. అర్హతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. న్యాయాధికారులు, న్యాయ సలహాదారులు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలలోని దాదాపు అన్ని మంత్రిత్వశాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల్లోని భర్తీల ప్రక్రియను యూపీఎస్‌సీ / స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు చేపడతాయి. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన వారినే ఈ పోస్ట్‌లకు అర్హులుగా ప్రకటిస్తారు. ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్‌తో డిగ్రీ ఉన్న వారే 'లా డిగ్రీ' చేయడానికి అర్హులు.
'లా' కమిషన్ సభ్యులు, ప్రభుత్వ న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సొలిసిటర్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఇన్‌కంటాక్స్, సేల్స్‌టాక్స్, ఎక్సైజ్‌లాంటి శాఖల ట్రైబ్యునల్స్‌లో ఖాళీలను బట్టి నిబంధనల ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. కొత్తగా న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందిన అభ్యర్థులను సాధారణంగా ప్రభుత్వ విభాగంలోని సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ల తరహా నాన్-గెజిటెడ్ పోస్టుల్లో నియమిస్తారు. సైన్యంలో పదాతి, నౌకా, వైమానిక దళాల్లోని న్యాయవిభాగాలలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమించే అవకాశం ఉంది. వీరు విచారణ కోర్టులను నిర్వహించి తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం ఉంటుంది.
న్యాయవ్యవస్థ 
న్యాయవ్యవస్థలో మేజిస్ట్రేట్/మున్సిఫ్ లేదా ఉప-న్యాయమూర్తి లాంటి కింది స్థాయి పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుంది లేదా హైకోర్టు పర్యవేక్షణలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈ అభ్యర్థులకు సాధారణ డిగ్రీతో పాటు న్యాయశాస్త్రంలోనూ డిగ్రీ ఉండాలి. సాధారణంగా వీరికి వయోపరిమితి 35 ఏళ్లు ఉంటుంది. ప్రత్యేక విభాగాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అధికారులకు జిల్లా, సెషన్స్‌కోర్టు జడ్జీలుగా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వారి సామర్థ్యాన్ని, అర్హతలను బట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులుగానూ పదోన్నతులు పొందే అవకాశమూ ఉంటుంది. గతంలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులను జిల్లా, సెషన్స్ జడ్జీలుగా ఎన్నుకునేవారు. కానీ నేడు చాలా రాష్ట్రాలు స్టేట్‌కమిషన్లు / హైకోర్టుల ద్వారా ప్రవేశపరీక్షలు నిర్వహిస్తూ ఎంపిక ప్రక్రియను చేపడుతున్నాయి.
విద్యాబోధన 
న్యాయశాస్త్రంలో ఎల్ఎల్ఎం, పిహెచ్‌డి లాంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు విశ్వవిద్యాలయాలు, లా విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంస్థల్లో అధ్యాపకులుగా పనిచేయవచ్చు. ప్రైవేట్ యూనివర్శిటీల సంఖ్య పెరుగుతుండటంతో విజిటింగ్ ప్రొఫెసర్లకు ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. పేరు ప్రతిష్టలున్న ప్రొఫెసర్లకు యూనివర్సిటీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
న్యాయశాస్త్రంపై మంచి పట్టు, రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉన్నవారు 'లా పుస్తకాలు' రాయవచ్చు, ఎడిటింగ్ చేయవచ్చు, న్యాయ నివేదికలు సమర్పించవచ్చు, న్యాయసంబంధ విమర్శలు చేయవచ్చు.
లీగల్ ఔట్‌సోర్సింగ్ 
న్యాయసేవలు అందించే ఒక సంస్థ బయటి సంస్థల నుంచి న్యాయసేవలు పొందడాన్నే 'లీగల్ ఔట్‌సోర్సింగ్' అంటారు. ఒకవేళ న్యాయసేవలను అందించే సంస్థ ఇతర దేశాల్లో ఉంటే దాన్ని 'ఆఫ్ షోరింగ్' అంటారు. మన దేశంలో 'లీగల్ ఔట్‌సోర్సింగ్'కు మంచి భవిష్యత్తు ఉందని, 2015 నాటికి ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య 79వేలకు చేరే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. లీగల్ ఔట్‌సోర్సింగ్‌లో ఉన్న ఉద్యోగావకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో మనదేశం విఫలమైంది. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 12వేలు మాత్రమే. డాటా సెక్యూరిటీకి భద్రత లేకపోవడం, భారతీయ న్యాయవాదులు విదేశీ బార్ పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలనే నిబంధన పెట్టడం లాంటివి దీనికి గల కారణాలు.
ఆదాయం
లా గ్రాడ్యుయేట్లు ఎంపిక చేసుకున్న రంగాన్ని బట్టి వారి ఆదాయం ఉంటుంది. ప్రభుత్వ విభాగంలో లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రభుత్వ నియమాలు వర్తించే ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ నియమాల ప్రకారం జీతభత్యాలు ఉంటాయి. ఆరో వేతనకమిషన్ సిఫార్సులు అమలైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వారు చేసే ఉద్యోగం, పనిని బట్టి 20వేల నుంచి లక్ష రూపాయల దాకా జీతభత్యాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మల్టీనేషనల్ కంపెనీలు, ఇతర న్యాయసంబంధ సంస్థలు క్యాంపస్ సెలక్షన్లను నిర్వహించి ఎంపికైనవారికి ఏడాదికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. అయితే స్వయంగా ప్రాక్టీసు ప్రారంభించే వారు మొదట్లో ఇబ్బంది పడాల్సి వచ్చినప్పటికీ కొన్నేళ్లు కష్టపడితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. .
కోర్సు వివరాలు
* లా కోర్సు చేయాలనుకునేవారు ఏదైనా విభాగంలో డిగ్రీ తర్వాత మూడేళ్ల ఎల్ఎల్‌బి (బ్యాచిలర్ ఆఫ్ లా) చేయవచ్చు లేదా ఇంటర్మీడియట్ (10+2) తర్వాత అయిదేళ్ల బిఎ,ఎల్ఎల్‌బి (ఆనర్స్) కోర్సు కానీ చేయవచ్చు.
* సాధారణంగా డిగ్రీలో సాధించిన మార్కుల శాతాన్ని బట్టి ఎల్ఎల్‌బిలో ప్రవేశాలు ఉంటాయి. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలు, నేషనల్ లా స్కూల్స్ లాంటి కొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఎల్ఎల్‌బి కాకుండా చాలా యూనివర్సిటీలు, సంస్థలు న్యాయశాస్త్రానికి సంబంధించిన పలు విభాగాల్లో డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.
* ప్రాక్టికల్ శిక్షణ, కోర్టు నిబంధనలు, మాదిరి కోర్టువ్యవహారాలు, సెమినార్లు, న్యాయసంబంధ సబ్జెక్టులపై సమావేశాలు,ఇతర కార్యక్రమాలను బిఎ,ఎల్ఎల్‌బి (ఆనర్స్) కోర్సులో భాగంగా నిర్వహిస్తారు.
* 2 సంవత్సరాల కాలపరిమితితో పీజీ కోర్సు ఎల్ఎల్ఎం (మాస్టర్ ఆఫ్ లా )ను చేయవచ్చు. ఎల్ఎల్‌బి డిగ్రీ పూర్తిచేసిన వారు ఎల్ఎల్ఎం పీజీ కోర్సును చేయడానికి అర్హులు. ఎల్ఎల్ఎం పీజీని పూర్తి చేసిన వారు తర్వాత న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ (ఎల్ఎల్‌డీ) (Ph.D LL.D) చేయవచ్చు.
స్పెషలైజేషన్లు
 సివిల్/ క్రిమినల్ లా
 ఇంటర్నేషనల్ లా
 కాన్సిట్యూషనల్ లా
 లేబర్ లా
 అడ్మినిస్ట్రేటివ్ లా
 రియల్ ఎస్టేట్ లా
 హ్యూమన్ రైట్స్ లా
 ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పేటెంట్ లా
 ఫ్యామిలీ లా
 టాక్సేషన్
 కార్పొరేట్ లా
 బిజినెస్ లా
మన రాష్ట్రంలో న్యాయవిద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయాలు / ఇతర సంస్థలు .
* ఉస్మానియా విశ్వవిద్యాలయం
* కాకతీయ విశ్వవిద్యాలయం
* ఆంధ్ర విశ్వవిద్యాలయం
* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
* శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
* శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
* శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం
* ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ లా, విశాఖపట్నం.
లాసెట్
మన రాష్ట్రంలోని లా కాలేజీల్లో చేరేందుకు ఏకైక మార్గం - 'లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(లాసెట్)'. ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, కళాశాలలు మూడేళ్ల, ఐదేళ్ల ఎల్ఎల్‌బి కోర్సులో ప్రవేశాలకోసం ప్రవేశపరీక్షను నిర్వహిస్తాయి. సాధారణంగా ప్రతి ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో 'లా'సెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రాత పరీక్షను మే లేదా జూన్ నెలలో నిర్వహిస్తారు.
విద్యార్హతలు 
1) మూడేళ్ల ఎల్ఎల్‌బి / బిఎల్ కోర్సు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 45 శాతం మార్కులతో ఏదైన విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
2) అయిదేళ్ల ఎల్ఎల్‌బి / బిఎల్ కోర్సు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో 45శాతం మార్కులతో ఉత్తీర్ణులులైన వారు అర్హులు.
వయోపరిమితి: అయిదేళ్ల లా డిగ్రీకి గరిష్ఠ వయోపరిమితిని ఓసీలకు 20 సంవత్సరాలుగా; ఎస్సీ, ఎస్టీ ఇతర వెనకబడిన తరగతుల వారికి 22 సంవత్సరాలుగా నిర్ణయించారు.
సీట్ల కేటాయింపు: లా సెట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా 100 శాతం సీట్లను మన రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశం లేదు.
లా సెట్ ప్రశ్నపత్రం: ఇంగ్లిష్, తెలుగు రెండు భాషాల్లోనూ లా సెట్ ప్రశ్నపత్రం ఉంటుంది. ప‌రీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. మూడు విభాగాల నుంచి మొత్తం 120 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 40 మార్కులు. కనీస అర్హత మార్కులను (కటాఫ్ మార్కులు) 42గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు.
మొత్తం మార్కులు: 120
గరిష్ఠ మార్కులు: 120
సమయం: 90 నిమిషాలు
విభాగం- A (40 ప్రశ్నలు - 40 మార్కులు) 
1) జనరల్ నాలెడ్జ్ (30 మార్కులు)
2) జనరల్ మెంటల్ఎబిలిటీ (10 మార్కులు) 
విభాగం - B (40 ప్రశ్నలు - 40 మార్కులు) 
వర్తమాన వ్యవహారాలు (కరెంట్ఎఫైర్స్ )
విభాగం - C (40 ప్రశ్నలు - 40 మార్కులు) 
అప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా (లీగల్ అప్టిట్యూడ్)
పరీక్ష తేదీ: జూన్ 8
.

Comments

Popular posts from this blog

VIVO Brand Guide + SWOT ANALYSIS

Business Strategy in a Digital Age